ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, ప్రజలను కలిసి వారి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఎవరైనా సరే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారి నుంచి వడ్డీతో కలిపి బాకీ తీర్చుకుంటామని అన్నారు.పార్టీలోకి కొత్త రక్తం ఎక్కించాల్సిన పని ఉందన్న చంద్రబాబు త్వరలోనే పార్టీలోని కమిటీలన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. యువతకు ప్రాధాన్యమిచ్చి సమర్థమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారుపార్టీలో కష్టపడి పనిచేసే వారికి పెద్ద పీట వేస్తామన్నారు.
కేసుల మాఫీ కోసమే జగన్ కేంద్రం కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కరోనా నియంత్రణలో జగన్ చేతులెత్తేశారని, ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ఎప్పుడూ మాస్కు పెట్టుకోలేదన్నారు. కరోనా నుంచి రక్షణ కోసం తాము వెబ్సైట్ను ప్రారంభిస్తున్నామని, వ్యాధి సోకకుండా ఏం చేయాలన్నదానితోపాటు ఇతర నియంత్రణ చర్యలకు సంబంధించి పూర్తి వివరాలను అందులో పొందుపరుస్తామన్నారు.