దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా… అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. 400 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి బడా నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న “ఆర్ఆర్ఆర్” మూవీని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్తో దాదాపు 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు రాజమౌళి. కరోనా తెచ్చిన లాక్డౌన్తో గత ఆరు నెలలుగా షూటింగ్ ఆపేశారు. అయితే ఇటీవలే తిరిగి షూటింగ్స్కి అనుమతి లభించినా కరోనా ఉదృతి తగ్గలేదని సెట్స్ మీదకు రాలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలాఖరులో అయినా షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్సయిన జక్కన్న.. అన్నీ పక్కాగా ప్లాన్ చేశారట. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి “ఆర్ఆర్ఆర్” నటీనటులందరినీ హోటల్స్లో క్వారంటైన్లో ఉండాలని రాజమౌళి సూచించినట్లు తెలుస్తోంది. వాళ్ళ క్వారంటైన్ పీరియడ్ అయ్యాకే షూటింగ్ ప్రారంభించేలా రాజమౌళి స్కెచ్ రెడీ చేశారని సమాచారం. ఒక్కసారి షూటింగ్ ప్రారంభమయ్యాక ఇబ్బందులు తలెత్తకుండా తన వంతుగా ఈ చర్యలు తీసుకుంటున్నానని టీం అందరితో చెప్పి సహకరించాలని కోరారట జక్కన్న. అలాగే షూటింగ్ స్పాట్లో ఉపయోగించే సామాగ్రిని ప్రత్యేకంగా శానిటైజేషన్ చేయించటం, థర్మల్ స్ర్కీనింగ్ ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటం వంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయబోతున్నారట రాజమౌళి. ముందుగా ఎన్టీఆర్కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.