భీమా కోరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విరసం నేత వరవరరావును ఆరోగ్య కారణాల రీత్యా విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భూమన విజ్ఞప్తిని బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ తప్పుబట్టారు.
ఓవైపు సీఎం జగన్ ప్రధాని మోదీని కలిసి ఆయనతో తీయించుకున్న ఫొటోలను పోస్టు చేస్తుంటారని పేర్కొన్నారు. మరోవైపు భూమన వంటి నేతలు మోదీ హత్యకు కుట్రపన్నిన నక్సలైటు వరవరరావును విడుదల చేయాలని కోరుతుంటారని దుయ్యబట్టారు. ఈ డబుల్ గేమ్ ఆపాలని సునీల్ దేవధర్ ట్వీట్ చేశారు.
సునీల్ దేవధర్ ట్వీట్ పై భూమన తాజాగా స్పందిస్తూ…. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని సమర్థించడం తన ఉద్దేశం కాదని తెలిపారు. కానీ అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడి పట్ల మానవతా దృక్పథంతో జాలి చూపించమన్నానని వివరించారు.
“వరవరరావు, నేను, ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు జైలులో కలిసి ఉన్నాం కాబట్టే, నేను ఉపరాష్ట్రపతికి లేఖ రాశాను. కానీ నా అభిప్రాయాన్ని సీఎంతో ముడిపెడుతూ ట్వీట్ చేయడం బాధ కలిగించిందని భూమన ఓ ప్రకటన విడుదల చేశారు.