ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా నేలపాడులో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అక్కలు, చెల్లెళ్లు ఉండగా ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. 23 ఏళ్లలో 93లక్షల మంది డ్వాక్రా సభ్యులయ్యారని, నాలుగున్నరేళ్లలో పసుపు కుంకుమ కింద 21,116 కోట్ల రూపాయలు ఇచ్చానని తెలిపారు. నిధులు లేకపోయినా మహిళలకు డబ్బులు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఆడబిడ్డలకు గౌరవం రావాలంటే ఆర్థికంగా ఎదగాలని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాలను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు తెలిపారు. భగవంతుడు తనకు ఇచ్చిన శక్తిని మీ కోసం ఉపయోగిస్తున్నానని అన్నారు. మూడు విడతలుగా రూ.10వేలను చెక్కుల రూపంలో అందజేస్తామన్నారు. ఒక్కో మహిళకు రూ.10వేలు ఇస్తామని, మూడు నెలల్లో రూ.9400కోట్లు అందజేస్తామన్నారు. ఏప్రిల్ లోపు మహిళలు డబ్బులు డ్రా చేసుకునేలా పసుపు-కుంకుమ పథకాన్ని అమలు చేస్తామన్నారు.