టీడీపీ-జనసేన పొత్తుపై పార్టీ పార్లమెంటు సభ్యుడు టీజీ వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సీట్ల కేటాయింపు విషయమై ఏపీ సీఎం చంద్రబాబుతో టీజీ వెంకటేశ్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..జనసేనతో తెలుగుదేశం పార్టీకి పెద్దగా విభేదాలు లేవని ఆయన అన్నారు. జనసేన, టీడీపీల మధ్య మార్చిలో చర్చలు జరిగే అవకాశం ఉందని వెంకటేష్ తెలిపారు. రెండు పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కుర్చీపై ఆశలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కేంద్రంపై పోరాటం విషయంలోనే ఇరు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయని అన్నారు. ఇరు పార్టీల నాయకుల మధ్య సదభిప్రాయం ఏర్పడిందని అన్నారు. కర్నూలు అసెంబ్లీ సీటుపై సర్వేల ఆధారంగానే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. సర్వేల్లో టీజీ భరత్ కు మెజారిటీ వస్తే ఆయనకే సీటు ఇవ్వాలనీ, ఒకవేళ ఎస్వీ మోహన్ రెడ్డికి వస్తే ఆయనకు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్లు పేర్కొన్నారు.