కరోనా వైరస్ వ్యాప్తికి ప్రజల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. జూలై నుంచి కరోనా ముప్పు భారీగా ఉంటుందని, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని స్పష్టం చేశారు.సుదీర్ఘ లాక్ డౌన్ ను సడలిస్తూ తీసుకువచ్చిన అన్ లాక్-1లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగా ఇప్పుడు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందనివిచారం వ్యక్తం చేశారు.
కరోనా నిబంధనలు పాటించడంలో విఫలమవుతున్నామని అన్నారు. లాక్ డౌన్ తో దేశంలోని చాలామంది ఇళ్లలో వంట కూడా చేసుకోలేని పరిస్థితులు ఎదుర్కొన్నారని వెల్లడించారు. అలాంటివాళ్లను కేంద్రం సకాలంలో ఆదుకుందని, అందుకోసమే గరీబ్ కల్యాణ్ యోజన తీసుకువచ్చామని అన్నారు. పేదల కోసం రూ.1.75 లక్షల కోట్ల ప్యాకేజి అమలు చేశామని వివరించారు.
ఇప్పుడు పండుగల సీజన్ వస్తోందని, ప్రజలెవరూ పస్తులు ఉండకూడదన్నది తమ ప్రభుత్వ నిర్ణయం అని మోదీ ఉద్ఘాటించారు. అందుకే దేశంలోని 80 కోట్ల మందికి పైగా నవంబరు వరకు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామని, అందుకోసం రూ.90 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని పేర్కొన్నారు.