తమ ఎన్నికల ప్రచారాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం పరిధిలో ఎన్నికల నిబంధనలకు అతీతంగా వ్యవహరిస్తున్న అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై బెదిరింపులకు దిగుతున్నట్లు రేవంత్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అధికార టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
రాత్రి 10గంటల వరకు ప్రచారానికి అనుమతి వుండగా 7గంటలకే తమను అడ్డుకుంటూ ఇబ్బందిపెడుతున్నారని అన్నారు. కానీ అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలు మాత్రం అర్థరాత్రి వరకు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వాధికారులు, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను టీఆర్ఎస్లో చేరమంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. అన్ని అనుమతులున్నా ఇలా పక్షపాతంగా వ్యవహరిస్తూ పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పోలీసులు, అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.