దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తనను టెర్రరిస్ట్ అన్న బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆపన్నుల కోసం తాను ఎంతో చేశానని, అలాంటి తాను ఉగ్రవాదిని ఎలా అయ్యానని ప్రశ్నించారు.
తాను ఒక డయాబెటిక్ పేషెంట్ నని, రోజుకు నాలుగు సార్లు ఇన్సులిన్ తీసుకుంటానని కేజ్రీవాల్ చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లవద్దని తనకు డాక్టర్లు గతంలో చెప్పారని… వెళితే నీవు బతకడం కూడా కష్టమేనని డాక్టర్లు చెప్పినప్పటికీ ప్రజల కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తన స్నేహితులు ఎంతో మంది విదేశాల్లో ఉంటున్నారని… తాను కూడా వెళ్లాలనుకుంటే విదేశాలకు వెళ్లి ఉండేవాడినని చెప్పారు. తాను తన ఉద్యోగాన్నే వదిలేశానని… ఏ ఉగ్రవాదైనా ఇలా చేస్తాడా? అని ప్రశ్నించారు.