ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 250కి పైగా చిత్రాలలో నటించిన గొల్లపూడి విజయనగరంలో జన్మించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన మృతి టాలీవుడ్ పరిశ్రమకి తీరని లోటు. గొల్లపూడి ఆత్మకి శాంతి కలగాలని సినీ ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు. మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నాడు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.
1939 ఏప్రిల్ 14న విజయనగరంలో గొల్లపూడి జన్మించారు. 13 ఏళ్ల వయస్సులోనే ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించారు. గొల్లపూడి .. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఉత్తమ రచయితగా నంది పురస్కారం అందుకున్నారు. గొల్లపూడి నటించిన చివరి చిత్రం జోడీ. 14 ఏళ్ళకే ఆశా జీవీ మొదటి కథ రాసారు. కె విశ్వనాథ్ తొలి చిత్రం ఆత్మ గౌరవం చిత్రానికి రచయితగా గొల్లపూడి పని చేశారు. గొల్లపూడి మారుతీ రావు విజయనగరంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వారు జీవితాంతం విశాఖపట్టణం లోనే నివాసమున్నారు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయము లలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతిక శాస్త్రములో బి.యస్సీ (ఆనర్స్) చేశాడు. ఈయన అన్నపూర్ణ, సుబ్బారావుకి అయిదో కొడుకు. గొల్లపూడి మారుతీరావు కుమారుడు దివంగత గొల్లపూడి శ్రీనివాస్ పేరుమీద, గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ప్రతి ఏట ఆగష్టు 12 న ,ఉత్తమ ప్రతిభను కనపరిచిన డెబ్యూ డైరెక్టర్ కి గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును ప్రదానం చేస్తుంది.గొల్లపూడి మారుతీ రావు కుమారుడు,గొల్లపూడి శ్రీనివాస్ ప్రేమ పుస్తకం అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నప్పుడు ప్రమాద వశాత్తు మరణించారు.ఆయన ఙ్ఞాపకార్దం మారుతీరావుగారు దేశంలోని వివిద భాషల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన డెబ్యూ డైరెక్టర్లకు గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ అవార్డులను ప్రదానం చేస్తున్నారు.