దాదాపు లక్షన్నర మందికి శాశ్వత ఉద్యోగాలు రావడం ఓ చరిత్ర అని ఏపీ సీఎం జగన్ అన్నారు. దేశ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయం అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి వైఎస్ జగన్ నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సరికొత్త రికార్డ్ అని అన్నారు. సొంత మండలంలో పనిచేసే అవకాశం గొప్ప అదృష్టం అని చెప్పారు.
వాలంటీర్లు ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలని సూచించారు. ప్రజల కోసం పనిచేసే బాధ్యతగా ఉండాలని వాలంటీర్లకు సూచనలు చేశారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరిట ప్రజలను దోచుకుందని ఆరోపించారు. ఆ పరిస్థితిని మార్చేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు..ప్రజల అవసరాలను ఇంటి వద్దే అందించేలా వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని తెలిపారు. ప్రతి గ్రామ వాలంటీర్కు స్మార్ట్ఫోన్ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రంలో మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.