సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘త్రీమంకీస్’. అనిల్కుమార్ దర్శకుడు. కారుణ్యచౌదరి కథానాయిక. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై నగేష్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర లోగో, ఫస్ట్లుక్ ఆవిష్కరణ శనివారం జరిగింది. సీనియర్ నటుడు నాగబాబు, నిర్మాత శ్యాంప్రసాద్రెడ్డి లోగో, ఫస్ట్లుక్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సుడిగాలి సుధీర్ అండ్ టీం గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదని, ప్రపంచమంతా వీళ్ల టాలెంట్ చూస్తున్నారని, ఇండస్ట్రీకి ఎంతోమంది మంచి నటులను అందించే ఫ్యాక్టరీ అని అన్నారు. గెటప్ శ్రీను లాంటి నటుడిని ఇండస్ట్రీ వాడుకోకపోతే అది వాళ్లకే నష్టం అని తెలియజేశారు నాగబాబు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ “ఆద్యంతం వినోదప్రధానంగా సాగే చిత్రమిది. బుల్లితెరపై నవ్వుల్ని పంచే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ వెండితెరపై కూడా అలరిస్తారనే నమ్మకం ఉంది. వినోదంతో పాటు కదిలించే భావోద్వేగాలున్న కథ ఇది” అన్నారు. “మా స్వస్థలం వరంగల్. కథా చర్చలన్నీ అక్కడే జరిగాయి. ప్రతి ఒక్కరూ ఆనందించే విధంగా చిత్రాన్ని రూపొందించాం” అని నిర్మాత తెలిపారు. షకలక శంకర్, కౌటిల్య తదితరులు నటిస్తున్నారు.