యుద్దానికి సిద్ధం అంటూ అనవసర బీరాలు పోతున్న పాక్ మరో నాటకీయ ప్రకటన చేసింది. భారత్కు పరోక్ష హెచ్చరికలు చేస్తున్నట్టుగా పాక్ త్వరలోనే ఒక క్షిపణి పరీక్షకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పాక్ అధికారులు ‘నోటమ్’ (నోటీస్ టు ఎయిర్మెన్), నావల్ వార్నింగ్ జారీ చేయడంతో క్షిపణి పరీక్షకు అవకాశాలున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. కరాచీ సమీపంలోని సొన్మియాని పరీక్షా కేంద్రం నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరగవచ్చని తెలుస్తోంది. ఈనెల 28, 31 తేదీల్లో సైనిక విన్యాసాలు ఉంటాయని కూడా ఆ నోటీసులో అధికారులు పేర్కొన్నారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్పై నిర్ణయాత్మక యుద్ధానికి సమయం ఆసన్నమైందని చేసిన వ్యాఖ్యలను పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ రావల్పిండిలో జరిగిన మీడియా సమావేశంలో పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో పాక్ అధికారులు ‘నోటమ్’ జారీ చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 చివరిలోగా, బహుశా అక్టోబర్, నవంబర్లో పాక్, భారత్ మధ్య యుద్ధం జరగవచ్చని, ఇదే రెండు దేశాల మధ్య చివరి యుద్ధం కావచ్చని షేక్ రషీద్ ఇవాళ మీడియా సమావేశంలో జోస్యం చెప్పారు.