వన్ప్లస్ సంస్థ స్మార్ట్టీవీల మార్కెట్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ సీఈవో పీటే లౌ దీనిపై స్పష్టతనిచ్చారు. తొలి వన్ప్లస్ స్మార్ట్టీవీని సెప్టెంబర్లో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. పైగా తొలుత భారత్లోనే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వన్ప్లస్ ఫోరంలో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే, స్మార్ట్టీవీకి సంబంధించి ధర గానీ, ఇతర వివరాలు గానీ వెల్లడించలేదు. స్మార్ట్టీవీ ప్రాజెక్ట్పై గత రెండేళ్లుగా పనిచేస్తున్నట్లు లౌ తెలిపారు. ఈ విభాగంలో విజయం సాధించేందుకు ఒక మార్కెట్పై పూర్తి దృష్టి సారించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఇప్పటికే భారత్లో కంటెంట్ ప్రొవైడర్లతో సత్సంబంధాలు ఉన్నాయని, తమతో భాగస్వామ్యానికి వారు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. తమ పరస్పర భాగస్వామ్యంతో యూజర్లకు గొప్ప కంటెంట్ను అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఉత్తర అమెరికా, యూరప్, చైనాలోనూ టీవీలను తీసుకురావడంలో భాగంగా అక్కడి స్థానిక కంటెంట్ ప్రొవైడర్లతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. స్మార్ట్టీవీ విభాగంలో అగ్రగామిగా నిలవాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. ఇప్పటికే స్మార్ట్ఫోన్ తయారీ విభాగంలో ఉన్న షావోమీ, శామ్సంగ్, ఎల్జీ, మైక్రోమ్యాక్స్ కంపెనీలు టీవీలను తయారుచేస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలకు ఈ విభాగంలో వన్ప్లస్ గట్టి పోటీ కానుంది.