జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీరీ ప్రజల హక్కులను భారత ప్రభుత్వం కాలరాస్తున్నా… ఐక్యరాజ్యసమితి నిద్రపోతోందని మండిపడ్డాడు. కశ్మీర్ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలని కోరాడు.
ఈ నేపథ్యంలో అఫ్రిది వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఘాటుగా స్పందించాడు. మానవ హక్కుల గురించి అఫ్రిది మాట్లాడటం చాలా సంతోషకరమని అన్నారు. అయితే మానవ హక్కుల ఉల్లంఘన పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మాత్రమే జరుగుతోందనే విషయాన్ని చెప్పడం ఆయన మర్చిపోయారని ఎద్దేవా చేశారు. అఫ్రిది కంగారు పడాల్సిన అవసరం లేదని, అన్ని విషయాలను తాము చూసుకుంటామని అన్నారు.