వచ్చే విద్యా సంవత్సరానికి తెలంగాణలో మరో మూడు వ్యవసాయ విద్యా కళాశాలల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ వీ ప్రవీణ్రావు అన్నారు. రెండో సారీ విశ్వ విద్యాలయం వీసీగా బాధ్యతలు తీసుకుని ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడు వ్యవసాయ విద్య కళాశాలలు మాత్రమే ఉండేవని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఇప్పటికే మరో నాలుగు నూతన కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రస్థుత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అనుగుణంగా ఉండేందుకు పాఠ్యాంశాలను సిద్ధం చేస్తున్నామన్నారు.