ట్రాయ్ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు రూ.3,050 కోట్ల జరిమానాను విధించింది. 2016 అక్టోబర్లో వచ్చిన కొత్త రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్టివిటీని నిరాకరించినందుకు టెలికం సంస్థలకు జరిమానా విధించాలని టెలికం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సూచించింది. దీంతో డిపార్టుమెంట్ ఆప్ టెలికం (DOT) రూ.3,050 కోట్ల జరిమానా విధించింది. ఈ విషయంలో అప్పటి నుంచి పోరాడుతున్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ కూడా షాక్ ఇచ్చింది. రూ.3,050 కోట్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. రిలయన్స్ జియో నెట్వర్క్తో ఇంటర్ కనెక్షన్లకు సహకరించని కారణంగా ట్రాయ్ ఈ విధమైన జరిమానా విధించిందని, ఇందులో మార్పు ఉండదని చెప్పేసింది.
జియో వినియోగదారులు ఇతర నెట్వర్క్లకు చేస్తున్న కాల్స్ 75 శాతం తిరస్కరణకు గురవుతున్నాయని రిలయన్స్ సంస్థ ట్రాయ్కి ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన ట్రాయ్ ఎయిర్టెల్, వొడాఫోన్లకు రూ.1,050 కోట్ల చొప్పున జరిమానా విధించగా, వొడాఫోన్ ఐడియాకు రూ.2,000 కోట్ల జరిమానాను విధించింది. వొడాఫోన్, ఐడియా సంస్థలు విలీనమై నూతన కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ జరిమానాను రెండు కంపెనీలు భరించే అవకాశం ఉంది. జరిమానాలతో పాటు కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలని భావించిన ట్రాయ్.. కోట్లాది వినియోగదారులకు అసౌకర్యం కలుగుతుందనే ఉద్ధేశంతో జరిమానాతో వదిలేసింది.