సురక్షితం అనుకున్న ప్రభుత్వ కార్యాలయాలలో కూడా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతుండటం రక్షణపై అసహనం వ్యక్తం చేస్తుంది. తాజాగా, అల్పసంఖ్యాకుల సంక్షేమ శాఖ అధికారి తన అల్పబుద్ధిని ప్రదర్శించాడు. అదే శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళను లైంగికంగా వేధించాడు. వేధింపులు శృతి మించడంతో భరించలేకపోయిన బాధితురాలు.. వంకర బుద్ధికి చెప్పుతో బుద్ధి చెప్పింది. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారిగా పని చేస్తున్న ఎం. శ్రీనివాస్ కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాను చెప్పినట్టు చేస్తే ఉద్యోగం కలిపిస్తానంటూ నిత్యం లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న అధికారి ఎం. శ్రీనివాస్ను స్థానిక నేతలతో కలిసి వెళ్లి నిలదీసింది. అయినా బెదిరింపులకు పాల్పడ్డంతో.. విసుగు చెందిన బాధితురాలు ఆఫీసులోనే చెప్పుతో కొట్టింది. ఈ ఘటనపై కలెక్టర్ విచారణతోపాటు.. ఇంటలిజెన్స్ అరా తీస్తున్నట్లు తెలుస్తుంది!