భారత ప్రధాని నరేంద్రమోదీకి పాక్ ప్రధాని లేఖ రాయడంపై శ్వేత సౌధం స్పందించింది. దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పాలంటే ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టాల్సిన బాధ్యత పాక్ మీద ఉందని స్పష్టం చేసింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేపట్టిన నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన రెండో లేఖ ఇది. కశ్మీర్తో సహా ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న సమస్యల సాధన కోసం కృషి చేద్దామని ఆ లేఖలో వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అరికట్టినప్పుడే చర్చలకు సిద్ధమని భారత్ ఇమ్రాన్ అభ్యర్థనను గతంలోనే తోసిపుచ్చింది.
కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరగనున్న ‘ఎస్సీఓ’ సదస్సులో ఇమ్రాన్ఖాన్తో మోదీ భేటీ ఉండదని గురువారం మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసిన అనంతరం దాయాది దేశం నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. పాక్ గడ్డ మీద స్వేచ్ఛగా తిరుగుతూ, ఆయుధాలు సమకూర్చుకొని, భారత్ మీద దాడికి పాల్పడే ఉగ్ర గ్రూపుల మీద చర్యలు చేపట్టడమే మేం ఆ దేశం నుంచి కోరుకునేదని శ్వేత సౌధ అధికారి ఒకరు వార్తా ఏజెన్సీకి వెల్లడించారు.
ఈ గ్రూపుల కార్యకలాపాలు అరికట్టనంత వరకు భారత్-పాక్ మధ్య శాంతి నెలకొనడం అసాధ్యమన్నారు. ఇప్పుడు బాధ్యత అంతా పాకిస్థాన్ మీదే ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా కట్టుదిట్టం చేయడం, అలాగే ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోపడం వంటి చర్యల మీద పాక్ దృష్టి సారించాలని గత వారం అక్కడి అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
“బిగ్ బాస్”లో మహిళా వివక్ష… యాంకర్ ఝాన్సీ ఫైర్