గత కొన్నిరోజుల క్రితం జరిగిన “మా” ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ విజయానికి ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబే కారణమంటూ వస్తున్న వార్తలను జీవిత ఖండించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీకి షాక్ ఇచ్చాయి. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు నియోజక వర్గాల్లోనూ ఓడిపోయారు. ఈ విషయంపై కూడా ఈరోజు జీవిత, రాజశేఖర్ దంపతులు జూబ్లీహిల్స్లో వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ “చాలా మంది “మా” ఎన్నికల్లో నాగబాబుగారు మీకు సపోర్ట్ చేశారుగా.. మరి ఎలక్షన్స్లో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని అడిగారు. అందరికీ నేను చెప్పేది ఒకటే. నాగబాబుగారి నియోజక వర్గానికి వెళ్లి నేను వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు. అలాగే భీమవరం నియోజక వర్గానికి కూడా వెళ్లలేదు. కానీ గాజువాక వెళ్లాల్సి వచ్చింది. అది నా చేతుల్లో లేదు. అది పార్టీ నుండి వచ్చిన ఆదేశం. పార్టీ ఇచ్చిన లిస్టు ప్రకారం నేను వెళ్లి ప్రచారం చేశాను.
నాకు పవన్ కళ్యాణ్ పై కోపమో, వ్యతిరేకతో ఉండుంటే.. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఐదేళ్లు అయ్యింది. ఇన్నేళ్లలో నేను ఏదైనా మాట్లాడి ఉండొచ్చు కదా. కానీ మాట్లాడలేదు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నన్ను అడిగి రచ్చ రచ్చ చేసినవాళ్లు.. ఎంతో మంది పవన్ పార్టీ పెట్టగానే మాట్లాడమని అడిగారు. నేను అందరితో `నో కామెంట్స్` అనే తిరిగాను. ఎలక్షన్ వరకు అలాగే ఉంటుందని భావించాను. కానీ కర్మ అనుసారం గాజువాకలో ప్రచారం చేయాల్సి వచ్చింది. అంతే తప్ప మేమేమీ ప్లాన్ చేసి ఏదీ చేయలేదు. ప్రజారాజ్యం సమయంలో నాకు, చిరంజీవిగారికి మధ్య ఏర్పిడిన విభేదాలు క్లియర్ కావడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు పవన్ విషయంలో నన్ను ట్రోల్ చేయకండి. నేను ఎలాంటి గొడవల్లో ఉండాలనుకోవడం లేదు. ఇప్పుడు నేను చేసింది కూడా పార్టీ కోసమే. ఫలితాలు తర్వాత పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు కూడా జాలేసింది. అయ్యో ఆయన ఒక సీటైనా గెలిచి ఉండుంటే బావుండేదని అనుకున్నాను. భీమవరంలోనైనా గెలుస్తారని అనుకున్నాను. కానీ గెలవలేదు” అని తెలియజేస్తూ పవన్ అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. .