వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మహర్షి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని దిల్రాజు, పొట్లూరి ప్రసాద్, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్గా నిలిచిన “మహర్షి” చిత్రం ఈ నెల 27కి 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఇప్పటికి ఈ చిత్రం 200 కేంద్రాల్లో సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. దీంతో చిత్ర బృందం జూన్ 28వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికలో 50 రోజుల వేడుకను ఘనంగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ వేడుకకు నేచురల్ స్టార్ నానిని గెస్టుగా ఆహ్వానించారని వార్తలు వచ్చాయి. కానీ ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల హఠాన్మరణంతో ఈ వేడుకని వాయిదా వేస్తున్నట్టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని నానక్రామ్గూడలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. అభిమానుల సందర్శనార్థం నేడు అక్కడే ఉంచి రేపు ఉదయం ఫిలించాంబర్కు తరలిస్తారు. శుక్రవారం మహా ప్రస్థానంలో విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. మహేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు హాజరు కానున్నారు.
previous post