“బాహుబలి”తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ తాజా చిత్రం “సాహో”. “రన్ రాజా రన్” ఫేం సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న “సాహో” చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ నిన్న తన ఎకౌంట్లో ఓ వీడియో షేర్ చేస్తూ సర్ప్రైజ్ ఇస్తానని అన్నాడు. అన్నట్టుగానే సాహో పోస్టర్ విడుదల చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించాడు. ఆగస్ట్ 15న సాహో చిత్రం విడుదల కానుందని పేర్కొన్నారు. ఈ పోస్టర్లో న్యూ లుక్లో ప్రభాస్ సరికొత్తగా కనిపిస్తున్నాడు.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్కీలు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ని క్యాప్చర్ చేయడం విశేషం. హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ను స్టార్ రైటర్ అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.