పాక్ జాతీయ దినోత్సవ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మార్చి 23 న జాతీయ దినోత్సవంగా పాక్ ప్రజలు జరుపుకుటుంటారు. ప్రధాని మోదీ తమకు ట్విట్టర్ ద్వారా శుబాకాంక్షలు తెలిపారని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. శాంతిసామరస్యతలు, సంపద, ఉగ్రవాద రహిత ప్రపంచం కోసం ఉపఖండం ప్రజలు ఐక్యంగా పని చేయాల్సిన సమయమిదని మోదీ తన సందేశంలో తెలిపారు.
పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ ఉగ్రస్థావరంపై భారత వాయుసేన దాడి తర్వాత భారత్, పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందా లేదా అన్న సందిగ్ధత నెలకొన్న సందర్భంలో మోదీ స్నేహ గీతం ఆలపించారు. మోదీ సందేశాన్ని స్వాగతిస్తున్నామని ఇమ్రాన్ పేర్కొన్నారు.