ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ తెలంగాణపై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత సి. రామచంద్రయ్య అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్నటి వరకు తెలంగాణలోనే ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆంధ్రవాళ్లు అంటున్నారని వ్యాఖ్యానించారు. పవన్ ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, తెలంగాణలో ఆంధ్రవాళ్లపై ఎప్పుడు దాడులు జరిగాయో పవన్ కల్యాణ్ చెప్పాలని ఆయన అన్నారు. చంద్రబాబు చెప్పిందే చేసినప్పుడు పవన్ కు సొంత పార్టీ ఎందుకని ఆయన ప్రశ్నించారు.
నారా లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసిన పవన్ మంగళగిరిలో జనసేన అభ్యర్థిని ఎందుకు బరిలోకి దింపలేదని ప్రశ్నించారు. టీడీపీకి జనసేన బీ టీమ్ లా పనిచేస్తోందన్నారు. పవన్ చంద్రబాబు డూపులా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంగళగిరిలో భూములు మింగిసేన వారికి మద్దతు ఇస్తారా అని పవన్ కల్యాణ్ ను ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించకుండా వైసీపీ పైనే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.