సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
కాపుల సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి ఏమాత్రం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాపుల భవిష్యత్తు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డం పెట్టుకుని వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని రామానాయుడు ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దివంగత తల్లిదండ్రులను ఉద్దేశించి అంబటి వాడిన భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, అంత దారుణంగా మాట్లాడుతున్నా జగన్ ఎందుకు వారించలేదని ప్రశ్నించారు.
ఇది జగన్ దర్శకత్వంలోనే జరుగుతున్న డ్రామా అని స్పష్టమవుతోందన్నారు.
కాపుల ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగాను ‘రౌడీ’ అని, ‘చంపితే తప్పేంటి’ అని అన్న గౌతమ్ రెడ్డికి ఆరు నెలల్లోనే ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవి ఇచ్చి జగన్ సత్కరించారని మండిపడ్డారు.
కాపుల కోసం పోరాడుతానన్న ముద్రగడ పద్మనాభం తన పేరు చివర ‘రెడ్డి’ అని తగిలించుకున్న తర్వాత కాపుల గురించి మాట్లాడటం ఆయన మనస్సాక్షికే వదిలేస్తున్నామన్నారు.
అంబటి రాంబాబు, జోగి రమేశ్, కొడాలి నాని వంటి నేతల బూతుల పురాణం కారణంగానే వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని, అధికారం కోల్పోయినా వారిలో మార్పు రాలేదని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో పల్నాడు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్న పై రాడ్లతో దాడి చేయించినప్పుడు జగన్కు వారి కులాలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు.
గతంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేసినప్పుడు అధికారంలో ఉన్న బొత్స సత్యనారాయణకు చట్టం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

