బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ కుల సంఘాలు భేటీ అయ్యాయి. డాక్టర్ ఎన్. మారేష్ నేతృత్వంలో బీసీ కుల సంఘాల నేతలు, ప్రతినిధులు ఈరోజు (శుక్రవారం) కీలక సమావేశం నిర్వహించారు.
ఈ నెల 26న అన్ని బీసీ కుల సంఘాలు కలసి జేఏసీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. పార్లమెంట్లో బీసీ సాధన కోసం ఆంధ్రప్రదేశ్లో జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సీఎం చంద్రబాబు బీసీ బిల్లుపై ప్రధాని మోడీతో చర్చించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల కోసం పోరాటం చేయటంపై హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్ మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారం బీసీ బిల్లుతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ బిల్లుపై ప్రధాని మోడీతో చర్చించాలని కోరారు.
టీడీపీ బీసీల పార్టీ స్థాయి నుంచి ఓబీసీల పార్టీగా ఎదగాలన్నారు. కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న చంద్రబాబు బీసీ బిల్లుపై దృష్టి సారించాలని వినతి చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో దేశ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతామన్నారు.
చంద్రబాబు బీసీలపై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఓబీసీల గుండెల్లో చిరస్థాయిగా చంద్రబాబు మిగిలిపోతారని తెలిపారు.
బీసీ బిల్లు కోసం యుద్ధాలు అక్కర్లేదని లక్షల కోట్ల బడ్జెట్లో అవసరం లేదన్నారు. జనాభాపరంగా బీసీలకు రావాల్సిన వాటా కేటాయిస్తే చాలని చెప్పుకొచ్చారు.
జేఏసీ ఆధ్వర్యంలో దశలు వారీగా పార్లమెంటులో బీసీ బిల్లు సాధన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎన్ మారేష్ పేర్కొన్నారు.