ఏపీలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది.
ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏళ్లుగా విచారణలో ఉన్న ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఇకపై సీబీఐ చేపట్టనుంది.
వివరాల్లోకి వెళితే 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో సుగాలి ప్రీతి మృతికి సంబంధించి కేసు నమోదైంది.
అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్లు బలంగా వినిపించాయి.
కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో ఇచ్చిన హామీ మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలుస్తామని, ఈ కేసును సీబీఐకి అప్పగించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని ఆయన గతంలో పలు సందర్భాల్లో భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ హామీని నెరవేరుస్తూ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడం గమనార్హం.
ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్ర పోలీసులు సీబీఐకి అందజేయనున్నారు.
ఆర్టికల్ 257 కింద రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చర్యలు: యనమల