తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల ఎన్నికల పోలింగ్ను ఈవీఎంలపైనే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) రజత్ కుమార్ తెలిపారు. లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతోనే రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. సచివాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో 1400 మంది ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1200 మంది ఓటర్లకు మించకుండా ఇప్పటికే 34,603 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని తెలిపారు. అవసరాన్ని బట్టి అనుబంధ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వం కొత్త పథకాలు, పనులు చేపట్టకూడదని సూచించారు. మంత్రులు అధికారిక పర్యటనలు చేయరాదన్నారు. హోర్డింగులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడపత్రాలను కూడా తొలగించాలని ఆదేశించారు.