తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిన ఘనత కేసీఆర్దేనని ఆమె ఎద్దేవా చేశారు.
కామారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన ఒక సభలో పాల్గొన్న మంత్రి సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడుతూ.. బడ్జెట్లో ఉన్న అనుమతిని మించి అప్పులు చేస్తున్నారంటూ నిర్మల పేర్కొన్నారు.
తెలంగాణలో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా లక్షా పాతికవేలు అప్పు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు . ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి తెలంగాణ అప్పులు చేసింది. కేంద్రం నిధులిచ్చినా కేసీఆర్ బద్నాం చేస్తున్నారు. ప్రజలను భయపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారు.
పైగా నేనే ప్రధాని అంటూ కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారు. ఉపాధీ హామీ పథకం కోసం కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చింది. ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారు.
కళేశ్వరం ప్రాజెక్టు అసలు వ్యయం కన్నా లక్షా 20వేల కోట్లు ఎలా పెంచారని మంత్రి సీతారామన్ ప్రశ్నించారు. తెలంగాణ రైతు ఆత్మహత్యలలో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. రైతులకు ఇచ్చిన హామీ లక్ష రూపాయల రుణ మాఫీ ఎందుకు చేయలేకపోయారు. రైతు బీమా కౌలు రైతులకు ఎందుకు ఇవ్వరు. పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప వాటిని నెరవేర్చడం లేదు. మిగులు బడ్జెట్ కాస్త లోటు బడ్జెట్ అయింది. బడ్జెట్ అప్రూవల్ కంటే ఎక్కువగా అప్పులు చేస్తున్నారు.
బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడం లేదని, ప్రభుత్వం చేస్తున్న అన్ని అప్పులనూ బడ్జెట్లో చూపించడం లేదంటూ ఆర్థికమంత్రి పేర్కొన్నారు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు