వైసీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి బాలినేనిని తప్పించిన జగన్ ఆయనను ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ సమన్వయ కర్తగా నియమించారు. అయితే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్కు .. జగన్ కేబినెట్లో రెండో సారి చోటు దక్కింది. దీనిపై బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. అలాగే తనకు వ్యతిరేకంగా పార్టీలో కొంతమంది పనిచేస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇటీవల మార్కాపురంలో సీఎం జగన్ మోహన్రెడ్డి సభ వద్ద పోలీసులు తనను అడ్డుకోవడంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ముఖ్యమంత్రి స్వయంగా పోన్ చేస్తే తప్ప బాలినేని వేదికపైకి రాలేదు. ప్రోటోకాల్ ఇష్యూ నుంచి పార్టీ అధిష్టానంపై బాలినేని గుర్రుగా ఉన్నారు.
ఈ ప్రచారం పై స్పందించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేవలం ఇది సోషల్ మీడియా సృష్టి అంటూ వ్యాఖ్యలు చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కి పార్టీలో సముచిత గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడైన ఆయన గౌరవానికి ఎటువంటి భంగం కలగదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఇదంతా ప్రచారమని, టీ కప్పులో తుఫాను లాంటిదే నంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
సీఏఏకు వ్యతిరేకంగా భారీ కుట్ర: అమిత్ షా