మాస్ మహా రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ . శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ రేపు జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సమయంలో చిత్ర బృందానికి ఊహించని షాక్ ఎదురైంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సోషల్మీడియాలో లీకయ్యాయి. రవితేజ విలన్స్కు వార్నింగ్ ఇస్తోన్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో చిత్రయూనిట్ షాక్ కు గురైంది.
ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఎడిటింగ్ రూమ్ నుంచి రామారావు చిత్ర సన్నివేశాలు లీకైనట్లు చిత్ర బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది. లీకైన సన్నివేశంలో అధికార పార్టీపై విరుచుకుపడుతూ పరోక్షంగా రవితేజ చేసిన డైలాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
“అధికారం ఉంది కదా అని.. కొండలు తోడేస్తా.. అడ్డంగా భూములు దోచేద్దాం అనుకుంటే”.. అంటూ రవితేజ వార్నింగ్ ఇస్తున్న డైలాగ్ చూస్తుంటే సినిమాలో కొంచెం పొలిటికల్ టచ్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది.
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. రజీష విజయన్, వేణు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్కు విశేష స్పందన లభించింది. ఇంతకు ముందెన్నడూ చూడని రవితేజ ఈ సినిమాలో విభిన్నమైన రోల్లో కనిపించనున్నారు.. రవితేజ ఇందులో ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.