దేశంలో పలు సందర్భాలలో ఎక్కడ బాంబు పేలినా ఆ మూలాలు హైదరాబాద్నగరంలో ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. అందుకే తాజాగా సరిహద్దుల్లో ఉద్రిక్తల దృష్ట్యా భద్రతాబలగాలు నగరంలో నిఘా కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాయి. సైన్యంతో సరిసమానంగా విధులు నిర్వహించే ఆక్టోపస్, స్వాట్ (స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్)లను రంగంలోకి దించారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, రక్షణ సంస్థల స్థావరాలు, కొన్ని బహుళ అంతస్తు భవనాల వద్ద బలగాలను మోహరించారు. ఉగ్రవాదులు మారువేషాల్లో, ముఖకవలికలు మార్చుకుని వచ్చినా గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాల్లో ఫేసియల్ రికగ్ననైజేషన్ సాఫ్ట్వేర్ను అమర్చారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఈ సదుపాయం ఉంది. ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన ఈ కెమెరాలు ఉగ్రవాదులు తమ పరిధిలోకి రాగానే పోలీసులను అప్రమత్తం చేస్తాయి.
నగరంలోని పాతబస్తీ, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది చేతికి ల్యాప్టాప్ లు, అత్యాధునిక కెమెరాలు అందించారు. అపరిచితులు తారసపడితే వారి వేలిముద్రలు, పేరు నమోదు చేస్తే వారి వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఉగ్రవాద సానుభూతిపరుల వివరాలు తెలుసుకునేందుకు ‘నో యువర్ నైబర్, టెనెంట్ వెరిఫికేషన్’ పేరుతో వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులు మాట్లాడుకునేటప్పుడు పసిగట్టేందుకు వీలుగా వాటిపై నిఘా పెట్టారు. దేశంలోని ఉగ్రబాధిత నగరాల్లో ఢిల్లీ, ముంబయి తర్వాత స్థానం హైదరాబాద్ దే. అందుకే పుల్వామా ఉగ్రదాడి అనంతర ఘటనలతో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా భద్రతా దళాలు ఈ నగరంపై ప్రత్యేక దృష్టి సారించాయి. లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, సిమి, హుజి, ఐసిస్ వంటి సంస్థల సభ్యులు దశాబ్దాలుగా ఇక్కడ తిష్టవేసి నగరంలో పలుమార్లు విధ్వంసాలకు పాల్పడిన సందర్భాలున్నాయి.