వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం అనుమానస్పద మృతి నేపథ్యంలో కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్పై ఉత్కంఠ కొనసాగుతుంది.
కాకినాడ జీజీ హెచ్లో సుబ్రహ్మణ్యం మృతదేహం ఉంది. పోస్ట్ మార్టం ఇంకా పూర్తి కాలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేస్తే తప్ప పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకునేది లేదని, అనంత ఉదయభాస్కర్ రప్పించాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, బంధువుల డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక మరోవైపు సుబ్రహ్మణ్యం మృతిపై ఎమ్మెల్సీ అనంతబాబు ఇంతవరకు స్పందించలేదు. నిన్న దర్జాగా రంపచోడవరం ఎమ్మెల్యేతో కలిసి రెండు వివాహాలకు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ హాజరయ్యారు.
ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వద్ద సుబ్రహ్మణ్యం ఐదేళ్ల పాటు డ్రైవర్గా పనిచేశాడు. మూడు నెలల క్రితం సుబ్రహ్మణ్యం.. ఎమ్మెల్సీ వద్ద డ్రైవర్గా మానేశాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఉదయభాస్కర్.. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో నూకమమ్మ గుడి సమీపంలోని అతని తల్లిదండ్రుల అపార్ట్మెంట్కు తీసుకెళ్లి వదిలిపెట్టాడు.
ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతిచెందాడని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో.. మృతదేహాం ఉన్న కారు అక్కడే వదిలేసి మరో వాహనంలో వెళ్లిపోయారు. అనంతరం సుబ్రహ్మణ్యం తల్లి వీధి రత్నం ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.