*వికారాబాద్ బాలిక అత్యాచారం..హత్య కేసులో ట్విస్ట్..
*ఇంట్లోనే బాలిక హత్య జరిగినట్లు అనుమానం..
*బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
*పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు..
వికారాబాద్ జిల్లా అంగడి చిట్టంపల్లిలో టెన్త్ క్లాస్ చదువుతున్న మైనర్ బాలికపై రేప్, హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకొంది,. బాలిక తల్లి లక్ష్మిపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బాలిక సోమవారం నాడు తెల్లవారు జామున కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వెళ్లింది. ఆ తర్వాత ఎంతకీ ఇంటికి రాలేదు. హత్య విషయం వెలుగులోకి రాగానే అదే ఊరిలో ఉండే బాలిక ప్రియుడిపై తొలుత బాధిత కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసింది.
అయితే బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం నాడు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. బాలిక ప్రియుడు పోలీసుల విచారణలో నోరు మెదపడం లేదని సమాచారం.
మరోవైపు తాజాగా పోలీసుల విచారణలో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఆ బాలికను ఆమె తల్లే చంపినట్లుగా భావిస్తున్నారు. విచారణలో భాగంగా చనిపోయిన బాలిక తల్లిని పోలీసులు ప్రశ్నించగా ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో తల్లి లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలిక హత్య ఆమె ఇంట్లోనే జరిగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో భాగంగా ఇప్పటిదాకా నిందితుడిగా భావిస్తున్న మహేందర్ ఆ సమయంలో బాలికను కలిసినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు.అసలు ఈ హత్యను ఎవరు చేశారనే విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.