నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన ‘అఖండ నేటితో 50వ రోజులోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 2న విడుదలైన ఈ మూవీ ప్రభంజనం సృస్టించింది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో 103 కేంద్రాల్లో విజయవంతంగా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వడంతో అఖండ పై సహజంగానే భారీ అంచనాలు పెరిగాయి. బాలయ్య విశ్వరూపం, బోయపాటి మాస్ డైరెక్షన్ థియేటర్లలో ఆడియెన్స్కు పూనకాలు తెప్పించింది.
అలాగే బాలకృష్ణ అఘోర పాత్ర చేయడం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.. సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ‘అఖండ 50వ రోజులో అడుగుపెట్టే సమయానికి థియేటర్లలో గ్రాస్-నాన్ థియేట్రికల్ హక్కులు మొత్తం కలిపి రూ. 200 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిపోయింది.
బాలయ్య కెరీర్లో ఈ మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతే కాదు టాలీవుడ్లో ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా ఇన్ని సెంటర్లలో 50 రోజులు ఆడలేదు. దీంతో నందమూరి అభిమానులు భారీ ఎత్తున వేడుకలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అఖండ మూవీలో బాలయ్యకు జతగా ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా నటించింది. త్వరలోనే ఈ సినిమా ఈనెల 21 నుంచి అఖండ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.