తోట చంద్రయ్య హత్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నిస్తున్న వారిని భయపెట్టేందుకే వైసీపీ హత్యాకాండకు పాల్పడుతోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అరాచక పాలనలో పల్నాడులోనే ఇప్పటికే పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయని అన్నారు.
స్థానిక ఎన్నికల టైంలో బోండా ఉమా, బుద్ధాపై దాడి చేశారని అన్నారు. గత దాడుల సమయంలోనే చర్యలు తీసుకుంటే అడ్డుకట్ట పడేదని తెలిపారు. దాడులు చేస్తే పదవులు కట్టబెట్టే విష సంస్కృతిని జగన్ చాటుకున్నారని విమర్శించారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
కాగా..చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన గుండ్లపాడు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గుండ్లపాడు లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు.
మరోవైపు ..వెల్దుర్తి మండలం గుండ్లపాడులోని చంద్రయ్య ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చంద్రయ్య మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు యత్నించారు. బ్రహ్మరెడ్డి వచ్చేవరకు చంద్రయ్య మృతదేహాన్ని తరలించవద్దని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. పోలీసులు ఆలస్యంగా వచ్చారంటూ చంద్రయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యాహ్నం గుండ్లపాడుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రయ్య మృతదేహం వద్ద నివాళులు అర్పించనున్నారు.
రాత్రికి రాత్రి సర్దుకుని వచ్చింది తమరే కదా చంద్రం సారూ: విజయసాయిరెడ్డి