కొండలు, లోయలు, కన్నార్పకుండా చూడాల్సిన అందాలు, గుహల్లో నుంచి ప్రయాణం వంటి అరుదైన అనుభూతులు… ఇవన్నీ అరుకు ప్రయాణం లో పర్యటకుల సొంతం. మరి ఆ అందాలను అద్దాల బోగీలో కూర్చొని వీక్షిస్తే ఆ మజానే వేరు. అయితే మన్యం అందాలను వీక్షించే మధురానుభూతి పర్యాటకులకు ఇప్పుడు సొంతమైంది. విస్టాడోమ్ కోచ్ ల ప్రత్యేక రైలు అరుకు అందాల లోకంలో విహరింపచేస్తుంది.
ఆంధ్రా ఊటీగా పేరున్న అరకు అందాల గురించి చెప్పాలంటే అక్షరం పులకిస్తుంది. అరకు వ్యాలీ అందాలు చూడడమే కాదు…విశాఖ నుంచి అరకు చేరుకునేందుకు చేసే ప్రయాణం సైతం ఇకపై మరింత సుందరం కానుంది. మంచు దుప్పటి కప్పుకున్న ఘాట్ రోడ్లు, మేఘాలు వచ్చి నేలను తాకాయా అనే మధురానుభూతిని పంచే గిరుల సోయగాలు,చినుకు తాకిడికి మెరిసిపోయే పచ్చనం, బొర్రా గుహల మధ్య వయ్యారంగా సాగిపోయే ప్రయాణం.
ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశాఖ నుంచి అరుకు వెళ్లే ప్రయాణం లో మనసుకు హత్తుకుంటాయి. మరి ఇంతతి అందాలను అద్దాల బోగి లో ప్రయాణిస్తూ ప్రకృతి రమణీయతను వీక్షిస్తే ఆ ఆనందమే వేరు. విశాఖ నుంచి అరకు వెళ్లే మార్గం లో క్షణం కన్ను ఆర్పినా అందాలు మిస్ అవుతామనే ఫీలింగ్ పర్యాటకులలో కలుగుతుంది. అద్దాల ట్రైన్ లో అలా పచ్చని చెట్లు, లోయల అందాలను చూస్తూ .సొరంగాలు లో సాగే ప్రయాణం చేస్తూ లెక్కలేనన్ని మధురానుభూతులను పొందవచ్చు.
ప్రకృతి అద్భుతాలను వీక్షించేందుకు అరకు-కిరండూల్ మధ్య అత్యాధునికమైన లింక్ హాఫ్మన్ బుష్ కోచ్లతో రైలు పట్టాలెక్కింది. ఈ ట్రైన్లో తొలిసారిగా స్లీపర్ క్లాస్ బోగీ ఏర్పాటు చేశారు. ఒక స్లీపర్ క్లాస్, 8 సెకండ్ సిట్టింగ్తో పాటు రెండు విస్టాడోమ్ కోచ్లతో ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. గతంలో పాత బోగీల్లో ప్రయాణించే పర్యాటకులు కుదుపులతో ఇబ్బందులు పడేవారు. అయితే ఇప్పుడు మాత్రం జర్మన్ టెక్నాలజీతో స్టెయిన్లెస్ స్టీల్తో రూపుదిద్దుకున్న ఎల్హెచ్బీ కోచ్ లలో అరుకు పర్యాటకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని రైల్వే శాఖ అందిస్తుంది.మరో వైపు ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్, బయో టాయిలెట్స్, సౌకర్యవంతమైన సీట్లు,ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోకుండా కోచ్ల్లో పీవీసీ ఫ్లోరింగ్ ఈ విస్టాడోమ్ కోచ్ల ప్రత్యేకత.
విశాఖ నుంచి కిరండోల్ వెళ్లే ఈ రైలు కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రైలు సముద్ర మట్టానికి 1300 ఎత్తులో ప్రయాణిస్తుంది.1960లో ఇనుప ఖనిజం తరలింపు కోసం నిర్మించిన ఈ మార్గం ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది దేశంలోనే ఎత్తైన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్. విశాఖ కిరండోల్ రైలు లో నూతనంగా ఏర్పాటు చేసిన విస్టాడోమ్ కోచ్లో లలో మొత్తం 40 సీట్లు ఉంటాయి. భారత రైల్వే దీన్ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో డిజైన్ చేయించింది. ఈ కోచ్ లు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ విస్టాడోమ్ కోచ్ లు .
బోగీలలో పర్యాటకులు ప్రకృతి అందాలను సౌకర్యవంతంగా వీక్షించడానికి పొడవైన పెద్ద అద్దాలతో కిటికీలు అమర్చారు.చెయిర్ కార్ బోగీ తరహాలోనే ఈ విస్టాడోమ్ బోగీలో సైతం రెండు వరుసల్లో రెండేసి విలాసవంతమైన కుర్చీలు ఉన్నాయి. సీట్లకు పుష్బ్యాక్ సౌకర్యం కూడా ఉంది. ఈ సీట్లను ప్రయాణికులు గుండ్రంగా తిప్పుకుంటూ అద్దాల నుంచి ప్రకృతిని స్వష్టంగా వీక్షించవచ్చును. బోగీకి ఒక చివర పెద్ద అద్దాలతో ప్రత్యేక లాంజ్ ను ఏర్పాటు చేసారు. ఈ బోగీలలో జీపీఎస్ ఆధారంగా పనిచేసే డిస్ప్లే బోర్డులు.. రాబోయే స్టేషన్ పేరు తదితర వివరాలను చూపిస్తుంది. సెరామిక్ టైల్స్తో కూడిన అత్యాధునిక టాయిలెల్స్ ఉన్నాయి.
విమానాల తరహాలో ఆహారం అందించడానికి బోగీలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఫుడ్ ట్రాలీ, హాట్ కేస్, బాటిల్ కూలర్, మైక్రోఓవెన్, టీ/కాఫీ మెషీన్, మిని రిఫ్రిజిరేటర్ వంటి సదుపాయలు కూడా ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు తో ఏర్పాటు చేసిన ఒక్కఒక బోగీ తయారీకి 3.8 కోట్లును రైల్వే వెచ్చించారు. ఒక్కో కోచ్ బరువు 39.5 టన్నులు ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే సమయంలో ఒకదానికొకటి ఢీకొట్టకుండా, పడిపోకుండా ఉండడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు ఉదయం 6.50 గంటలకు బయల్దేరి ఉదయం 10.45 గంటలకు అరుకు చేరుతుంది. ఈ రైలు టికెట్ ధర విశాఖ నుంచి అరకుకు 665 రూపాయిలు,అరకు నుంచి విశాఖకు 565 రూపాయిలు ఉంది. ఈ రైలు విశాఖ లో ప్రారంభం అయి అరుకు చేరే సరికి 84 వంతెనలు మీదుగా, 58 సొరంగాల నుంచి ప్రయాణిస్తుంది. ఈ మార్గం గుండా రైలు ప్రయాణిస్తుంటే చుట్టూ ప్రక్కల ఉన్న సహజసిధ్ధం అయినా అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అయితే ప్రస్తుతం పిక్నిక్ ల సీజన్ కావడం తో ఈ రైలు లో అరుకు వెళ్ళాలి అనుకునే పర్యాటకులు సుమారు నెల రోజులు ముందు టికెట్ బుకింగ్ చేసుకోవలసి వస్తుంది. కొన్ని రోజులు వేచివుండి అయినా అరుకు అద్దాల రైలు లో వెళ్ళాలి అని చాల మంది పర్యాటకులు టికెట్ లు బుక్ చేసుకుంటున్నారు.
భారత రైల్వే నూతనంగా ఏర్పాటు చేసిన విస్టాడోమ్ బోగీలలో ప్రయాణం చేస్తుంటే మరిచిపోలేని అనుభూతి కలుగుతోంది అని పర్యాటకులు అంటున్నారు. గ్లాస్ రూప్టాప్, చుట్టూ తిరిగే రివాల్సింగ్ సీట్లు, ఆధునిక సౌకర్యాలు ఎంతో బావున్నాయని పర్యాటకులు చెబుతున్నారు. ఇంతకు ముందు ఎన్నో సుందర ప్రదేశాలను చూసిన,ఇంత అద్భుతమైన ప్రయాణం ఎప్పుడూ చేయలేదని, అద్దాల బోగీలో ప్రయాణం ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. పెద్దలు ,పిల్లలు అని తేడా లేకుండా రైలు లో అరుకు కు ప్రయాణం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అరుకు రైలు లో ప్రయాణం చేస్తుంటే విమానం లో ప్రయాణించే అనుభూతి కలుగుతుంది అని ప్రయాణికులు అంటున్నారు. అరుకు వెళ్ళడానికి రోడ్డు మార్గం లో కాకుండా రైలు లో ప్రయాణం చేయడానికే పర్యాటకులు మొగ్గు చుపుతున్నారు.
ఇదిలా ఉంటె భారత రైల్వే నూతనంగా ఏర్పాటు చేసిన అరుకు కిరండోల్ రైలు కు పర్యాటకుల తాకిడికి అనుగుణంగా మరి కొన్ని విస్టాడోమ్ కోచ్ లను ఏర్పాటు చేయాలి అని కోరుతున్నారు. అన్ని రైలు లా కాకుండా ఈ విశాఖ కిరండోల్ రైలు పై రైల్వే శాఖ ప్రత్యేక ద్రుష్టి సారించి శుభ్రంగా ఉంచాలి అని అంటున్నారు. దీనితో పాటు టికెట్ ధర కూడా తాగించి సామాన్య ,మద్యతగరతి ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని కోరుతున్నారు.