టాలీవుడ్ యంగ్ హీరోలు శర్వానంద్- సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. అజయ్ భూపతి దర్శకత్వంలో వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ట్రైలర్ని విడుదల చేసింది. లవ్, యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఒకే ఫ్రేమ్లో శర్వానంద్, సిద్ధార్థ్ కనిపించి సందడి చేశారు. ఇద్దరూ పోటీపడి నటించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
సముద్రం సన్నివేశంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ‘సముద్రం చాలా గొప్పది. చాలా రహస్యాల్ని తనలోనే దాచుకుంటుంది’ అంటూ శర్వానంద్ ఎంట్రీ ఇచ్చిన తీరు మెప్పిస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్ పవర్ఫుల్గా కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. జగపతి బాబు, రావు రమేశ్ ప్రతినాయక పాత్రల్లో మెప్పించారు. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.
‘‘ఇక్కడ మనకి నచ్చినట్టు బతకాలంటే.. మన జాతకాల్ని దేవుడు మందుకొట్టి రాసుండాలి’’ అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్.. ‘‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా’’ అంటూ సిద్ధార్థ్ పలికే సంభాషణల్లో దర్శకుడు అజయ్ భూపతి మార్క్ కనిపిస్తోంది. ‘‘నేను దూరదర్శన్లో మహాభారత యుద్ధం చూసిన మనిషినిరా.. ఎదుటోడు వేసిన బాణానికి ఎదురు ఏ బాణం వేయాలో నాకు బాగా తెలుసు’’ అంటూ రావు రమేశ్ తన స్టైల్లో డైలాగ్ చెప్పడం ఆకట్టుకుంటోంది.