కుంభమేళలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కుంభమేళాలో పాల్గొన్న 30 మంది నాగసాధువులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆల్ ఇండియా అఖాడా పరిషత్ నాయకుడు మహంత్ నరేంద్ర గిరి కరోనాతో రిషికేశ్లోని ఎయిమ్స్లో చేరారు. కరోనా విజృంభణ నేపథ్యంలో నిరంజన్ అఖాడా సాధువుల బృందం కుంభమేళాను వీడేందుకు సిద్ధమైంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై స్పందించారు. ప్రస్తుత మహమ్మారి కఠిన పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగా అంటే సింబాలిక్ గా జరపాలంటూ సాధువులను కోరారు. కుంభమేళాలో పాల్గొన్న సాధువుల్లో అనేక మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ జునా అఖాడా హెడ్ స్వామి అవధేశానంద్ గిరితో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సాధువుల ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని.. వారికి ప్రభుత్వం అన్ని విధాలా వైద్యసాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇక కుంభమేళా ప్రాంతంలో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 15 వరకు 2 వేల వందమందికి పైగా భక్తులు వైరస్ బారినపడ్డారు.
previous post
next post