2014లో మూతపడ్డ సిర్పూర్ పేపర్ మిల్లు మళ్లీ తెరుచుకోవడంపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమలో నిన్న రాత్రి 8.20 గంటలకు మళ్లీ కాగితపు ఉత్పత్తి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సిర్పూర్ పేపర్ మిల్లు మళ్లీ తెరుచుకోవడంతో పాటు ఉత్పత్తి ప్రారంభమయింది. దీంతో వందలాది మంది కార్మికుల కుటుంబాల్లో ఆనందం నిండనుంది. ఇందుకోసం ప్రత్యేక చోరవ చూపిన పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ గారికీ, ఆయన టీమ్ కు అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరణ చేపట్టిన అనేక మూతపడ్డ పరిశ్రమల్లో సిర్పూర్ మిల్లు ఒకటి’ అని ట్వీట్ చేశారు.
నిజాం కాలంలో 1938లో సిర్పూర్ పేపర్ మిల్లును స్థాపించారు. 1950లో బిర్లాగ్రూప్ దీన్ని టేకోవర్ చేసింది. అప్పటినుంచి నిరాటంకంగా ఉత్పత్తి కొనసాగింది. కొత్త యంత్రాల కొనుగోలు పేరుతో యాజమాన్యం 2007-08 మధ్యకాలంలో మిల్లును ఐడీబీఐకు తాకట్టు పెట్టింది. అయితే నష్టాలు పెరిగిపోవడంతో 2014 సెప్టెంబర్ 27న సంస్థ మూతపడింది. అప్పటికే 3,200 మంది కార్మికులు పేపర్ మిల్లుపై ఆధారపడి బతుకుతున్నారు. మిల్లులో పేపర్ ఉత్పత్తి కావడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.