అధ్యక్షపదవి చేపట్టినప్పటి నుండి వలసవాదులపై ఉక్కు పాదం మోపుతున్న ట్రంప్ మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు. ప్రతిభ ఉన్నవారు తమ దేశానికి రావాలనే ఉద్దేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పడం గమనార్హం. సోమవారం ఆయన యూఎస్ కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వలసదారుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తమ దేశానికి వచ్చేవారు న్యాయపరంగా రావాలని కోరారు. అక్రమ వలసదారులు దేశానికి పెను ముప్పుగా ఆయన పేర్కొన్నారు. ‘అమెరికన్ల ఉద్యోగాలు, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ వలస వ్యవస్థను రూపొందించడం మా నైతిక బాధ్యత. మా చట్టాలను గౌరవిస్తూ నేడు లక్షల మంది వలసదారులు అమెరికాలో నివసిస్తున్నారు. న్యాయపరంగా వచ్చే వలసదారులు మా దేశానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు.
విదేశీయులు ఇంకా ఎక్కువ మంది మా దేశానికి రావాలనే నేనూ కోరుకుంటున్నాను. కానీ వారు న్యాయపరంగా రావాలి’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మెక్సికోలో సరిహద్దు గోడ నిర్మాణాన్ని గురించి కూడా ట్రంప్ పస్తావించారు. మెక్సికో సరిహద్దులో గోడ లేకపోవడం ఆర్థిక పరంగా, భద్రత పరంగా దేశానికి పెను ముప్పుగా ఉందని ఆయన అన్నారు. అందుకే ఆ సరిహద్దు గోడను కట్టి తీరుతానని మరోసారి స్పష్టంగా చెప్పారు.