ప్రతి ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 4 -10వ తేదీ వరుకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు రాజోలు ఎస్ఐ పేర్కొన్నారు. శనివారం ఉదయం రాజోలు ఎస్ఐ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ కన్న వాళ్లకు, భార్యా పిల్లలకు జీవితాంతం కన్నీళ్లను మిగల్చవద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రోడ్డు నియమ నిబంధనలను పాటించాలని.. లేకపోతే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు.
దేశంలో ప్రతి సెకన్కు ముగ్గురు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులకు వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ తప్పనిసరి అని చెప్పారు. సురక్షిత ప్రయాణం కోసం రోడ్డు నిబంధనలను పాటిస్తే అసలు ప్రమాదాలనేవే ఉండవన్నారు. బాధ్యతా రాహిత్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గరై కన్నోళ్లకు కన్నీళ్లు మిగుల్చద్దని ఎస్ఐ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి డిపో మెనేజర్ మనోహర్, డ్రైవర్లు, ఆటో వర్కర్స్ నాయకులు పాల్గొన్నారు.