ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతూ, దేశంలోనే అత్యంత శక్తివంతమైన తీరప్రాంత కేంద్రంగా రూపాంతరం చెందుతోంది.
ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘హిందుస్థాన్ టైమ్స్’ ప్రచురించిన కథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
ఈ కథనంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, విశాఖ అభివృద్ధికి తమ ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టం చేశారు.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వేగంగా విస్తరిస్తున్న టెక్ రంగం, ఏఎంటీజెడ్ (AMTZ) నాయకత్వంలోని మెడ్-టెక్ హబ్, అద్భుతమైన సహజ సౌందర్యం కలగలిపి విశాఖలో అనంతమైన అవకాశాలకు తలుపులు తెరుస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.
గూగుల్ ఏఐ పెట్టుబడుల నుంచి అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ల వరకు, హిల్-టెక్ క్యాంపస్ల నుంచి కొత్త ఎయిర్పోర్ట్, మెట్రో రైల్ నిర్మాణం వరకు ప్రతీ అంశం వైజాగ్ ప్రగతికి నిదర్శనమని ఆయన వివరించారు.
లక్ష్యంతో కూడిన పాలన, ప్రజల ఆకాంక్షలు కలిస్తే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో విశాఖ నగరం నిరూపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.
తూర్పు తీరానికి వైజాగ్ను ఆర్థిక, ఆవిష్కరణల కేంద్రంగా (ఇంజిన్గా) మార్చడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రతీ భారతీయుడు గర్వపడేలా వైజాగ్ను ఒక గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు