telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పిల్లాడిని దత్తత తీసుకోండి… నాది బాధ్యత… సుజీత్ తల్లిదండ్రులకు లారెన్స్ విజ్ఞప్తి

Sujith

తమిళనాడులో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ విల్సన్ మృతిచెందిన సంగతి తెలిసిందే. తిరుచ్చిలో ఈనెల 25న రెండేళ్ల సుజిత్ దురదృష్టవశాత్తు బోరు బావిలో పడిపోయాడు. 35 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. అధికారులు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టి నాలుగు రోజులపాటు కష్టపడినా సుజిత్ ప్రాణాలను కాపాడలేకపోయారు. సుజిత్ క్షేమంగా బయటకు రావాలని తమిళనాడు ప్రజలతో పాటు యావత్తు దేశం ఆకాంక్షించింది. కానీ, దేశ ప్రజల ప్రార్థనలు సుజిత్‌ను కాపాడలేకపోయాయి. కాగా, బిడ్డను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న సుజిత్ తల్లిదండ్రులకు హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన సానుభూతిని తెలియజేశారు. సుజిత్ ఎక్కడికి వెళ్లిపోలేదని, దేశ ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడని అన్నారు లారెన్స్. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేశారు. ఈరోజు (అక్టోబర్ 29న) తన పుట్టినరోజు అయినప్పటికీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోవడంలేదని పేర్కొన్నారు. సుజిత్ మరణం తనకు అంత బాధను కలిగించిందని లారెన్స్ పరోక్షంగా వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా సుజిత్ తల్లిదండ్రులకు లారెన్స్ ఒక విన్నపం చేశారు. దేశంలో ఎంతో మంది పిల్లలకు తలిదండ్రులు లేరని. అలాంటి పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకుని.. ఆ పిల్లాడికి సుజిత్ అని పేరు పెట్టమని లారెన్స్ కోరారు. ఇలా సుజిత్ తల్లిదండ్రులు ఒక పిల్లాడిని దత్తత తీసుకుంటే.. అతడు చదువుకోవడానికి అయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానని లారెన్స్ వెల్లడించారు. మరి లారెన్స్ విన్నపానికి సుజిత్ తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో చూడాలి. వాస్తవానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు లారెన్స్‌కు కొత్తేమీకాదు. ఆయన సొంతంగా చారిటీని ఏర్పాటుచేసి కొన్ని వందల మంది చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించారు. తన చారిటీ ద్వారా ఎంతో మందిని ఆదరిస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు తానే స్వయంగా వెళ్లి సహాయ సహకారాలు అందించారు. తాను సంపాదించే మొత్తంలో చాలా వరకు లారెన్స్ సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నారు.

Related posts