మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయం ఇంకా కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తుండడంతో బీజేపీ నేతలు అందుకు ఒప్పుకోవట్లేదు. ఈ విషయంపై బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మహారాష్ట్రలో శివసేన నుంచి కొత్తగా ఎన్నికైన 45 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావాలని వారు కోరుకుంటున్నారు. వీరిలో కొంత మంది ఎమ్మెల్యేలు… శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు నచ్చజెప్పి ఒప్పిస్తారని, ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తానని నేను భావిస్తున్నానన్నారు. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో రాష్ట్రంలో మరో మార్గం ఉందని నేను భావించట్లేదని సంజయ్ పేర్కొన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ-శివసేన కూటమి మ్యాజిక్ మార్క్ దాటినా.. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోంది.