బాలీవుడ్ నుంచి మరో హిస్టారికల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే “పానిపట్”. 1761 జనవరి 14న అఫ్గానిస్థాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీకి, మరాఠా సామ్రాజ్యానికి మధ్య జరిగిన మూడో యుద్ధమే పానిపట్. ఈ కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు అషుతోష్ గోవారికర్. అర్జున్ కపూర్, సంజయ్దత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే “పానిపట్” సినిమాపై జాట్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్లోని భరత్పూర్లో జాట్ చక్రవర్తిగా పేరొందిన మహారాజా సూరజ్మాల్ పాత్రను తప్పుగా చూపించారంటూ ఆ వర్గానికి చెందిన కొంతమంది ఆరోపిస్తున్నారు. పానిపట్ సినిమా జాట్ వర్గీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని సినిమా ప్రదర్శనను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జైపూర్లోని ఓ థియేటర్పై దాడి చేశారు. థియేటర్లోని అద్దాలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ సీఎం అశోక్గెహ్లాట్ మాట్లాడుతూ..కళలు, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిన అవసరముందన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదన్నారు. డిస్ట్ట్రిబ్యూటర్లు ఆందోళనకారులతో చర్చలు జరుపాల్సిన అవసరముందని, అలా అయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
previous post