నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ఎస్ఈసీగా కొనసాగించాల్సిందేనని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని భావిస్తోంది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడారు. కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. ఒక్కోసారి న్యాయం జరగకపోవచ్చని చెప్పారు.
కోర్ట్ తీర్పు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్న విషయం నిజమే అని అన్నారు. అంతమాత్రాన రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకసార్లు కోర్టు తీర్పులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎస్ఈసీ వ్యవహారంలో హైకోర్టు తీర్పును పరిశీలిస్తామని, అభ్యంతరాలు ఉంటే పై కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. ఇక, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై వ్యాఖ్యానిస్తూ, ఆయన పక్షపాత ధోరణితో వెళుతున్నందునే ఆర్డినెన్స్ తీసుకువచ్చామని అంబటి వెల్లడించారు.