మరోసారి జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన కేసీఆర్ ఈసారి మంత్రి వర్గ విస్తరణలో మహిళల ప్రాతినిథ్యం ఉంటుందన్నారు. ఇప్పటికే తెలంగాణ కేబినేట్ లో మహిళలకు మంత్రి పదవులు దక్కకపోవడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువిరుస్తున్నాయి. 2014 లో టీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా మహిళలకు కేబినేట్ లో స్థానం దక్కలేదు.
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పద్మాదేవేందర్ రెడ్డి, ప్రభుత్వవిప్ గా సునీతలను నియమించారు. వీరితోపాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇచ్చినప్పటికీ మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముందస్తు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలు ఈ అంశాన్ని ఆయుధంగా తీసుకుని ప్రచారం చేశారు. ఈసారి అలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు మహిళలకు కేబినేట్ లో అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు.