టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ, పార్లమెంట్ తుది జాబితా విడుదల చేశారు. కొద్ది రోజులుగా కొన్ని స్థానాల అభ్యర్థుల ఎంపికలో ఉత్కంట నెలకొంది. ఆ స్థానాల్లో ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించి టీడీపీ ఉత్కంటకు తెరతీసింది. మంత్రి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం లో ఈ సారి అనూహ్యంగా సబ్బం హరి కి కేటాయించారు. టిజి వర్సెస్ ఎస్వీ గా మారిన కర్నూలు సీటును టిజి వెంకటేష్ తనయుడు భరత్ కు కేటాయించారు. ఇక హైడ్రామా మధ్య తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు సీటు దక్కలేదు. ఆ పార్టీ ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంట్ జాబితాల్లో ఎక్కడా స్థానం లభించలేదు.
రాధాకు బందరు పార్లమెంట్, అవనీగడ్డ, నరసాపురం పార్లమెంట్ స్ధానాల్లో ఏదో ఒకటి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ అంచనాలకు అందకుండా చంద్రబాబు.. వంగవీటిని పక్కనపెట్టేయడంతో ఆయన అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. కేవలం జగన్ పై విమర్శల కోసమే రాధాను పార్టీలోకి తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాతో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా రాధాను పోటీకి దూరంగా ఉంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే అవకాలున్నాయని ప్రచారం జరుగుతోంది.