ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రజల జీవితాలను తారుమారు చేసింది. ప్రజల జీవితాలపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. అన్ని రంగాలపైన కరోనా ప్రభావం పడింది. ముఖ్యంగా ప్రైవేట్ టీచర్ల ఇబ్బందులు అన్నీఇన్నీకాదు. గత 7 నెలలుగా టీచర్లు, లెక్చరర్లు ఉద్యోగాలు లేక, జీతాలు లేక ఇంటికే పరిమితం అయ్యారు. ఇల్లు గడవడం కోసం కొంతమంది కూరగాయల వ్యాపారం చేస్తుంటే, మరికొందరు టిఫిన్ షాపులు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని హల్లిగడ్డ గ్రామానికి చెందిన వీరన్న గౌడ దేవానాంప్రియ గవర్నమెంట్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. కరోనాకు ముందు వరకు కాలేజీ ఆయనకు రూ.13వేలు జీతం అందించేది. గత తొమ్మిదేళ్లుగా గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నా ఆయన్ను పోస్ట్ రెగ్యూలరైజ్ కాలేదు. కరోనా కాలంలో ఉద్యోగం పోయింది. ఇంటికే పరిమితం అయ్యారు. ఉమ్మడి కుటుంబం కావడం, వీరన్నగౌడ జీతంపైనే ఆధారపడి కుటుంబం జీవిస్తుండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో లెక్చరర్ గొర్రెల కాపరిగా మారిపోయారు. గ్రామంలోని ఓ వ్యక్తికి చెందిన గొర్రెలను కాస్తూ రోజుకు రూ. 200 సంపాదిస్తున్నారు. అలానే అయన భార్య కూలిపనులు వెళ్తూ రోజుకు రూ.150 సంపాదిస్తోంది. లాక్ డౌన్ కాలంలో అప్పులు చేశామని కుటుంబం గడవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో గొర్రెల కాపరిగా మారాల్సి వచ్చిందని వీరన్నగౌడ తెలిపాడు.
previous post
next post