తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. 5,100 బస్సులను ప్రైవేటు రూట్లలో నడపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఆ నిర్ణయంపై స్టే విధించింది. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు.
ఈ నేపథ్యంలో, ప్రభుత్వ వాదన పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేటీకరణపై తదుపరి విచారణ ముగిసేంత వరకూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసి కార్పొరేషన్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.